తెలుగు న్యూస్...
'కులకేక'గా మారిన.. కాకతీయ వర్శిటీ 'పొలికేక'!
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం నిర్వహించిన 'పొలికేక.. కులకేక'గా మారింది. విద్యార్థి నేతల సమన్వయ లోపం, హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా రాజకీయ రంగు అలుము కోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపుతుందని భావించిన ఈ పొలికేక.. యూనివర్శిటీ విద్యార్థి లోకంలోనే కులచిచ్చుకు దారితీసింది. దీంతో దీనికి హాజరైన తెలంగాణ విద్యార్థి లోకం నివ్వెరపోయింది.
సభ ఆరంభం నుంచి గాడి తప్పిపోయింది. సభా కార్యక్రమాలను నిర్వహించేందుకు, వేదికపై నుంచి ప్రసంగించేందుకు విద్యార్థి నేతలు ఒకరికొకరూ పోటీపడ్డారు. వీరికి తోడు.. వేదికపై నుంచి ప్రసంగించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిక చేసిన వ్యాఖ్యలు అగ్రవర్ణ విద్యార్థులను మరింత రెచ్చగొట్టాయి.
ఫలితంగా.. ఈ సభ రసాభాసగా మారి కులకేకగా మారిపోయింది. విద్యార్థులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అందులో అగ్రవర్ణ విద్యార్థి వర్గం మంద కృష్ణ మాదిగ ప్రసంగానికి అడ్డు తగలడమే కాకుండా, ఆయనపై మంచినీటి ప్యాకెట్లు, చెప్పులు, రాళ్లు ఇతరాత్రా వస్తువులతో దాడి చేసింది.
ఇది దళిత వర్గ విద్యార్థులకు ఆగ్రహం తెప్పించింది. ఆయనతో ప్రసంగాన్ని పూర్తి చేయించేందుకు పట్టుబట్టింది. ఫలితంగా సభ పూర్తిగా అదుపు తప్పిపోయింది. దీంతో సభలో ప్రసంగించాల్సిన ముఖ్యఅతిథి సామాజికవేత్త స్వామి అగ్నివేష్ వెనుదిరిగి వెళ్లిపోగా, తెలంగాణ గాయకుడు దేశపతి శ్రీనివాస్కు ఎమ్మార్పీఎస్ మద్దతు దారులు దేహశుద్ధి చేశారు. అలాగే, మంద కృష్ణ మాదిగకు కూడా అగ్రవర్ణ విద్యార్థుల నుంచి పరాభవం తప్పలేదు.
|